కరోనా వ్యాక్సిన్ ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి: కేంద్రం

  • కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు
  • భారత్ బయోటెక్, క్యాడిలా సంస్థలు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నాయి
  • త్వరలోనే ట్రయల్స్ మొదలవుతాయి
కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. సామాజిక వ్యాప్తి దశకు వైరస్ చేరుకుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకైతే సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ తెలిపారు. సామాజిక వ్యాప్తికి సరైన నిర్వచనాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇంత వరకు ఇవ్వలేదని చెప్పారు.

మన దేశంలో కరోనాకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయని రాజేశ్ భూషణ్ తెలిపారు. భారత్ బయోటెక్, క్యాడిలా హెల్త్ కేర్ సంస్థలు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే యానిమల్ టాక్సిసిటీ స్టడీస్ పూర్తయ్యాయని తెలిపారు. ఫేజ్ 1, ఫేజ్ 2 దశల్లో క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతించిందని చెప్పారు. త్వరలోనే ట్రయల్స్ మొదలవుతాయని వెల్లడించారు.

Corona Virus
Vaccine
Bharat Biotech
Cadila

More Telugu News